శేరిలింగంపల్లి, ఆగస్టు 13 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఎస్ఎంఆర్ వినయ్ అపార్ట్మెంట్స్, ట్రాంక్విల్ టవర్స్ మధ్య ఉన్న రహదారికి మరమ్మత్తులు చేపట్టాలని కోరుతూ జోనల్ కమిషనర్కు ట్రాంక్విల్ టవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాంక్విల్ టవర్స్, ఎస్ఎంఆర్ వినయ్ అపార్ట్మెంట్స్ మధ్య బొటానికల్ గార్డెన్కు వెళ్లే రహదారిని 200 మీటర్ల వరకు నిర్మించకుండా వదిలేశారని అన్నారు. దీని వల్ల రహదారి గుంతలు పడి అస్తవ్యస్తంగా మారిందన్నారు. కీలకమైన ఐటీ జోన్ కావడం వల్ల నిత్యం వేలాది వాహనాలు ఈ రహదారి గుండా ప్రయాణిస్తుంటాయని, రహదారి అధ్వాన్నంగా ఉండడంతో వాహనదారులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. వెంటనే రోడ్డు మరమ్మత్తు పనులను చేపట్టాలని కోరారు.






