హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు కోవిషీల్డ్, కోవాగ్జిన్లు అందుబాటులోకి రావడం అభినందనీయమని ప్రముఖ హోమియోపతీ వైద్యులు పి.కల్పన అన్నారు. వ్యాక్సిన్ల తయారీ, ఉత్పత్తిలో భారత్ కు ఇది చరిత్రలోనే ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుందని, ఇమ్యునాలజీ చరిత్రలో భారత్ పేరు నిలిచిపోతుందని అన్నారు. ఆ రెండు వ్యాక్సిన్లకు డీసీజీఐ అనుమతులు ఇవ్వడం శుభ పరిణామమని అన్నారు.
కోవిషీల్డ్ వ్యాక్సిన్ను బ్రిటన్కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు సంయుక్తంగా కలిసి అభివృద్ధి చేయగా దాన్ని భారత్లో పూణెకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. చింపాజీలకు వ్యాపించే సాధారణ జలుబుకు చెందిన వైరస్ స్ట్రెయిన్తో కోవిషీల్డ్ వ్యాక్సిన్ను రూపొందించారని తెలిపారు. అలాగే ఇనాక్టివేట్ అయిన కరోనా వైరస్ నుంచి కోవాగ్జిన్ను రూపొందించారని, దీన్ని శరీరంలోకి పంపినప్పుడు కరోనా వైరస్కు వ్యతిరేకంగా పోరాడే యాంటీ బాడీలు తయారవుతాయని, దీంతో కోవిడ్ నుంచి రక్షణ లభిస్తుందని తెలిపారు.

కాగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ 70.42 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని క్లినికల్ ట్రయల్స్లో వెల్లడైందని, అలాగే కోవాగ్జిన్ 60 శాతం వరకు పనిచేస్తుందని తేలిందని డాక్టర్ కల్పన తెలిపారు. అయితే 50 శాతానికి పైగా ప్రభావం చూపే ఏ వ్యాక్సిన్ అయినా సరే ప్రస్తుతం అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన నేపథ్యంలో ఆ రెండు వ్యాక్సిన్లు భారతీయులకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.
కోవాగ్జిన్ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తో కలిసి భారత్ బయోటెక్ రూపొందించినందున ఈ విషయం భారత్కు, హైదరాబాద్కు గర్వ కారణమని అన్నారు. వ్యాక్సిన్లను అభివృద్ధి చేసేందుకు ఎంతగానో కృషి చేసిన సైంటిస్టులు, నిపుణులతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నందున దేశంలో కరోనా కట్టడి అవుతుందని అన్నారు. అయినప్పటికీ ప్రతి ఒక్కరూ మాస్క్లను ధరిస్తూ సామాజిక దూరం పాటించాలని, కోవిడ్ జాగ్రత్తలను పాటించాలని కోరారు.
Well said ! We should appreciate our doctors
Thank you for all the support and Information.