శేరిలింగంపల్లి, జనవరి 19 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి రచయితల సంఘం అధ్యక్షుడు, తెలుగు వెలుగు సాహిత్య వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి కవి, సీనియర్ జర్నలిస్టు మోటూరి నారాయణరావును కర్ణాటక కు చెందిన సంక్రాంతి లిటరరీ అవార్డ్ వరించింది. కర్ణాటక తెలుగు రైటర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బెంగళూరు లోని ఇండో ఏషియన్ అకాడమీ కళాశాల ప్రాంగణంలో సంక్రాంతి లిటరరీ అవార్డ్స్ 2026 కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా దక్షిణాది భాషా పండితులు, కవులు, రచయితలు హాజరైన మల్టీ లింగ్వల్ పోయిట్ మీట్ కు కవి మోటూరి నారాయణరావు హాజరయ్యారు.

KTRF అధ్యక్షుడు మాల్యాద్రి నిర్వాహణ సారధ్యంలో బహుభాషా కవి సమ్మేళనం నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అస్సాం, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి విచ్చేసిన కవుల సమక్షంలో మోటూరి నారాయణరావు లిటరరీ అవార్డ్ 2026 ను అందుకున్నారు. ఈ సందర్భంగా మోటూరి నారాయణరావును మాట్లాడుతూ అజంతా భాషగా అలరారే అందమైన తెలుగు భాష ను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మాతృభాష అస్థిత్వాన్ని కోల్పోతే తెలుగు ఉనికి ప్రశ్నార్థకమవుతుందని వాపోయారు. పరభాషా వ్యామోహంలో పడి అమ్మ భాషను విడనాడటం మంచిది కాదన్నారు. తెలుగు భాషాభివృద్ధికి అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. తెలుగు భాషాభిమానులను ఒక వేదికపైకి తీసుకువచ్చి సాహిత్యాభ్యున్నతికి కృషి చేస్తున్న కర్ణాటక తెలుగు రైటర్స్ ఫెడరేషన్ సేవలను కొనియాడారు. సంక్రాంతి లిటరరీ అవార్డ్ అందించిన కార్య నిర్వాహక బృందానికి తెలుగు వెలుగు సాహిత్య వేదిక తరఫున కృతజ్ఞతలు తెలిపారు.





