శేరిలింగంపల్లి, డిసెంబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ చౌరస్తా మెహఫిల్ హోటల్ నుండి నిజాంపేట్ కమాన్ వరకు ఇగ్నైట్ ఇన్స్టిట్యూషన్, అవంతిక కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ స్వచ్ హైదరాబాద్, రన్ ఫర్ ఫన్ కార్యక్రమంలో హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రన్ ఫర్ స్వచ్ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా నగరంలో పరిశుభ్రత, ఆరోగ్యం, పౌర బాధ్యతను ప్రోత్సహించే ఒక కార్యక్రమం అని అన్నారు. పౌరులలో పరిశుభ్రతపై అవగాహన పెంచడం, వ్యర్థాల నిర్వహణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాల వాడకాన్ని ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఈ పరుగులో విద్యార్థులు, యువకులు, ఫిట్నెస్ ఔత్సాహికులు, సాధారణ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇగ్నైట్ సంస్థల చైర్మన్ రమేష్, కాలేజీ స్టాఫ్, విద్యార్థులు, యువకులు, ఫిట్నెస్ ఔత్సాహికులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






