శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, వనరుల పునర్వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో శనివారం 17 దేవాలయాల్లో డివైన్ వేస్ట్ కలెక్షన్ డ్రైవ్ నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు వినియోగంలో లేని పూజా సంబంధిత వస్తువులను అందజేశారు. కార్యక్రమంలో భాగంగా మొత్తం 922 ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. పౌరులు అందజేసిన వస్తువులను అక్కడికక్కడే తూకం వేసి, వివరాలను నమోదు చేశారు. పాల్గొన్న వారికి రిజిస్ట్రేషన్, సేకరణ వివరాల ఆధారంగా అనంతరం ఈ-సర్టిఫికెట్లు అందించనున్నారు. ఆన్లైన్ రికార్డులతో పాటు వివరాల ధ్రువీకరణ కోసం మాన్యువల్ రికార్డులను కూడా నిర్వహించారు.

17 దేవాలయాల నుంచి మొత్తం 2,425.85 కిలోల వస్తువులు సేకరించారు. ఇందులో విగ్రహాలు, లోహ వస్తువులు, పీఓపీ వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు, చెక్క ఫ్రేమ్లు, గాజు వస్తువులు, పుస్తకాలు తదితర పూజా సంబంధిత వస్తువులు ఉన్నాయి. సేకరణ, తూకం ప్రక్రియ అనంతరం ఉద్వాసన పూజ నిర్వహించారు. అనంతరం సేకరించిన వస్తువులను వాటి పదార్థ స్వభావాన్ని బట్టి వేర్వేరుగా విభజించారు. ఆయా పదార్థాలను తదుపరి రీసైక్లింగ్, తగిన ప్రాసెసింగ్ ప్రక్రియలకు తరలించనున్నారు. తద్వారా పూజా సామగ్రిని గౌరవప్రదంగా నిర్వహించడంతోపాటు సాధ్యమైన మేరకు వనరుల పునరుద్ధరణ, పునర్వినియోగానికి ఉపయోగించనున్నారు. కార్యక్రమం అమలు తీరును పరిశీలించేందుకు CMC కమిషనర్ సృజన, కుకట్పల్లి జోనల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ (శానిటేషన్) కలిసి అల్విన్ కాలనీలోని శ్రీ చిత్తారమ్మ దేవాలయాన్ని సందర్శించారు. అక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, వస్తువుల సేకరణ, తూకం, రికార్డు నిర్వహణతో పాటు ఉద్వాసన పూజ అనంతరం చేపడుతున్న వస్తువుల విభజన ప్రక్రియను పరిశీలించారు.

922 రిజిస్ట్రేషన్లు, 2,425.85 కిలోల సేకరణతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా భక్తి సంప్రదాయాలను గౌరవిస్తూనే పర్యావరణ పరిరక్షణ, రీసైక్లింగ్, వనరుల పునర్వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచే దిశగా CMC మరో ముందడుగు వేసింది.





