శేరిలింగంపల్లి, నవంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మాదాపూర్ డివిజన్ పరిధిలో ఉన్న ఖానామెట్ సర్వే నంబర్ 41/12, 41/13 లలోని ప్లాట్ నంబర్లు 7, 8, 9 లలో ఉన్న సుమారు 600 గజాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జాల నుంచి రక్షించాలని కోరుతూ స్థానికుడు సయ్యద్ కరీం శేరిలింగంపల్లి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు కబ్జాలు చేపట్టి అక్రమంగా నిర్మాణాలను నిర్మిస్తున్నారని అన్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు, సిబ్బంది కన్నెత్తి కూడా చూడడం లేదని అన్నారు. ప్రభుత్వ భూముల్లో చేపడుతున్న సదరు నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని, అన్యాక్రాంతం కాకుండా రక్షించాలని కోరారు. లేకపోతే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని, ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.






