శేరిలింగంపల్లి, ఆగస్టు 23 (నమస్తే శేరిలింగంపల్లి): శ్రావణమాస బోనాల మహోత్సవాల సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కేశవనగర్, లింగంపల్లి డివిజన్లోని లింగంపల్లి గ్రామంలో కొలువైన శ్రీ నల్ల పోచమ్మ, భూలక్ష్మి, ఎల్లమ్మ అమ్మవార్లను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా ఆశీస్సులు పొందినట్లు రవికుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర ప్రజలతోపాటు శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, సుభిక్షాలు నెలకొనాలని కోరుకున్నట్లు చెప్పారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, లింగంపల్లి కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్, డివిజన్ అధ్యక్షుడు కిషోర్, సీనియర్ నాయకులు సోమయ్య యాదవ్, విజయలక్ష్మి, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.





