శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని అంజయ్య నగర్ డివిజన్లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్చార్జి రవికుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలను, వారి అమరత్వ స్ఫూర్తిని స్మరించుకున్నారు. భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా నిజాం పాలనకు ముగింపు పలికి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన చారిత్రక ఘట్టాన్ని గుర్తుచేశారు. ఆ చారిత్రక సందర్భానికి గుర్తుగా ప్రతి ఏటా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

తెలంగాణ విమోచనం, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కోసం ప్రాణత్యాగం చేసిన పోరాట యోధులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రవికుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాధాకృష్ణ యాదవ్, రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి పద్మ, జిల్లా అధికార ప్రతినిధి ఆంజనేయులు సాగర్, సీనియర్ నాయకులు వినయ్, ఓబుల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సరోజ, ఆమని, కిషన్ సింగ్, ఆత్మారాం, ముకేష్ తదితరులు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.





