నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తాండ గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తీజ్ ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రంగారెడ్డి ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ పాల్గొని మాట్లాడారు. వందేళ్ల చరిత్ర గల తీజ్ పండుగ రాను రాను మరింత ఆదరణ పెరుగుతుందన్నారు. సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా తమ పండుగలను ఎంతో ఘనంగా జరుపుకుంటారని అన్నారు. తీజ్ ఉత్సవాల్లో తమ ఆరాధ్య దైవమైన శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్, జగదాంబ యాడి ఆశీస్సులతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తామన్నారు.

ఈ వ్రతాన్ని బంజారా యువతీలు ఆనందోత్సాహాలతో చేసుకునే పండగ అని, వ్రతాన్ని పెళ్లి కాని యువతులు అత్యంత వైభవంగా శ్రావణమాసంలో మొదలు పెట్టి 9 రోజులపాటు ఘనంగా గా నిర్వహిస్తారని అన్నారు. అడవి నుంచి తెచ్చిన స్వచ్ఛమైన పుట్ట మట్టిలో గోధుమలు చల్లి 9 రోజులు నీరు పోస్తూ మొలకలు వచ్చిన తరువాత మొక్కల బుట్ట తో నీళ్లు ఉన్న చెరువులో బంజారా ఆడపిల్లలు నృత్యాలు చేస్తూ నీళ్లు పోశారు. ఈ ఉత్సవాలలో ఎం సిపిఐ యు రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్, బిజెపి రాష్ట్ర కార్యవర్గం సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పల పాటీ శ్రీకాంత్, బిజెపి మియాపూర్ డివిజన్ అధ్యక్షుడు మాణిక్ రావు, తాండ కార్యదర్శి నాయిని రత్నకుమార్, సీతారాం నాయక్ , మధుసూదన్, గోపీనాయక్, చందు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.