శేరిలింగంపల్లి, మే 14 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కమిషనర్ సృజన కమిషనర్ కార్యాలయంలో జోనల్ కమిషనర్లు, విభాగాధిపతులు (HODs), డెప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో జరుగుతున్న పౌర పనులు, ఫిర్యాదుల పరిష్కార వేగం, ఇతర కీలక కార్యక్రమాల పురోగతిని ఈ సందర్భంగా సమీక్షించారు. ఇంజనీరింగ్ పనులు, పారిశుధ్యం, టౌన్ ప్లానింగ్, ప్రత్యేక ప్రాజెక్టులు, వార్డు స్థాయి అమలుపై కమిషనర్ సుదీర్ఘంగా చర్చించారు. పనుల అమలులో జవాబుదారీతనం, పౌర సేవల నాణ్యతను పెంచడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అన్ని పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, పనుల నాణ్యత, కొలతలు, బిల్లుల ధ్రువీకరణపై కఠినమైన పర్యవేక్షణ ఉండాలని అన్నారు.

ఫిర్యాదులను కేవలం మూసివేయడం (Closing) కాకుండా, నాణ్యమైన పరిష్కారం చూపాలని, పౌరులకు సంతృప్తికరమైన, స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని అన్నారు. ఫిర్యాదులను మూసివేసేటప్పుడు అసంబద్ధమైన చిత్రాలను లేదా అస్పష్టమైన వ్యాఖ్యలను ఉపయోగించకూడదని అధికారులను హెచ్చరించారు. జోనల్ కమిషనర్లు, విభాగాధిపతులు క్రమం తప్పకుండా ఫిర్యాదుల పరిష్కార తీరును ఆడిట్ చేయాలని, ఫిర్యాదుల డేటాను (జోన్ వారీగా, విభాగాల వారీగా) విశ్లేషించి, సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఫిర్యాదులు చేసే పౌరులను ఎట్టి పరిస్థితుల్లోనూ భయపెట్టడం లేదా నిరుత్సాహపరచడం చేయకూడదని, పౌర స్నేహపూర్వక దృక్పథంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
ప్రతిరోజు ఒక వార్డు (One Ward Every Day) కార్యక్రమంలో భాగంగా గుర్తించిన సమస్యలపై కమిషనర్ ప్రత్యేక సూచనలు చేశారు. వార్డు సందర్శనలో వెల్లడైన సమస్యలను ప్రాధాన్యత ప్రాతిపదికన పరిష్కరించాలని, అదే సర్కిల్లో తదుపరి పర్యటన జరిగేలోపు గరిష్ట సమస్యలు పరిష్కారమవ్వాలని, ప్రతి సమస్యను పోర్టల్లో అప్డేట్ చేస్తూ, అది పూర్తిగా పరిష్కారమయ్యే వరకు పర్యవేక్షించాలని, వార్డు సందర్శనల సమయంలో పౌరులు ఎంతో ఆశతో వస్తున్నారని, సకాలంలో స్పందించడం, జవాబుదారీతనంతో పనిచేయడం, క్షేత్రస్థాయిలో మార్పు చూపడం మన బాధ్యత అని అన్నారు. టౌన్ ప్లానింగ్ లో బిల్డ్ నౌ, ఎల్ఆర్ఎస్ (LRS) దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, పోలీస్ శాఖ సమన్వయంతో ఆక్రమణల తొలగింపు ముమ్మరం చేయాలని, ఇంజనీరింగ్ అండ్ స్పెషల్ ప్రాజెక్ట్స్ లో HCITI, SNDP, జంక్షన్ల అభివృద్ధి, ఫ్లైఓవర్లు, వర్షపు నీరు నిలిచే ప్రాంతాల్లో (Water logging) పనులను వేగవంతం చేయాలని అన్నారు.
పారిశుధ్యం, SWM లో భాగంగా జివిపి (GVP) పాయింట్ల నిర్మూలన, సాట్ (SAT) వాహనాల పర్యవేక్షణ, నో బిన్ – నో ట్రేడ్ (No Bin – No Trade) నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, మెట్రో స్టేషన్లు, ORR పరిసరాల్లో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని అన్నారు. దోమల నివారణకు వార్డుల వారీగా ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి ఫాగింగ్, స్ప్రేయింగ్, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, పార్కులు, క్రీడా ప్రాంగణాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్వహణ, లీజుల స్థితిగతులను సమీక్షించి, అవి ప్రజలకు మెరుగ్గా ఉపయోగపడేలా చూడాలని ఆదేశించారు.





