శేరిలింగంపల్లి, ఆగస్టు 24 (నమస్తే శేరిలింగంపల్లి): రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షకు విద్యార్థులు, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ నాయకులు మద్దతుగా తరలివచ్చారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కొనసాగుతున్న నిరాహార దీక్షకు శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి పలువురు నాయకులు, విద్యార్థులు హాజరై సంఘీభావం తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ అజిత్ కుమార్ సేనాపతి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోపుగొండ మహిపాల్ రెడ్డి, హఫీజ్పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్, చందానగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నాయకుడు రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






