నమస్తే శేరిలింగంపల్లి: ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యవసర వైద్యం కోసం హైదరాబాద్కి రోగులను తీసుకు వస్తున్న అంబులెన్సులను రాష్ట్ర సరిహద్దుల వద్ద అడ్డుకోవడం చట్టవిరుద్ధమని బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు డి.ఎస్.అర్.కె.ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒకప్పుడు హైదరాబాద్ రాజధాని ఐనందున పెద్ద పెద్ద హాస్పిటల్స్ హైదరాబాద్లోనే పెట్టేరని, మెరుగయిన వైద్యం కోసం రాజధానిలో ఎక్కువ నిధులు వెచ్చించారని అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత పది సంవత్సరాలు హైదరాబాద్ మీద రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు హక్కు వుందని విభజన బిల్లులోనే పొందుపరచారన్న విషయాన్ని గుర్తు చేశారు. మరీ ఈ కరోనా వైరస్ సెకండ్ వెవ్ తీవ్రంగా వున్న ఈ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాట్లాడుకొని ప్రజల సమస్యలు తీర్చాలి తప్పా ప్రజలను ఆయోమయానికి గురి చేయవద్దని సూచించారు. ప్రభుత్వాలు మానవతా దృక్పథంతో ఆలోచించాలని, ప్రజల ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మీద వుందని ప్రసాద్ పేర్కొన్నారు. హాస్పిటల్లో బెడ్స్ బుక్ చేసుకుంటేనే అంబులెన్సు లు అనుమతిస్తామని చెప్పడం చట్ట విరుద్ధమని అన్నారు. అసలు ప్రైవేట్ హాస్పిటల్స్లో ముందస్తుగా బెడ్స్ బుక్ చేసుకునే స్థితిలో సగటు మనిషి లేడని, రోగిని ఎలాగైనా కాపాడుకుందామని కుటుంబ సభ్యులు హైదరాబాద్కి తీసుకు వస్తున్న పరిస్థితిని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు.
