శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): గంజాయి విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో మాదాపూర్ పోలీసులు ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి 64 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండకు చెందిన ఎలక్ట్రీషియన్ కంజెర్ల క్రాంతి కుమార్ (22)ను మాదాపూర్లోని చంద్ర నాయక్ తండా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని తనిఖీ చేయగా 14 ప్యాకెట్లలో ఉన్న మొత్తం 64 గ్రాముల గంజాయి లభించింది. గంజాయిని ప్యాకింగ్ చేసి దాచేందుకు ఉపయోగించిన కవర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి, ఇతర వస్తువుల విలువ సుమారు రూ.2,100 ఉంటుందని పోలీసులు తెలిపారు.

విచారణలో నిందితుడు నాగ్పూర్, మహారాష్ట్రకు చెందిన గుర్తుతెలియని వ్యక్తుల నుంచి గంజాయిని తీసుకువచ్చినట్లు, అనంతరం చిన్నచిన్న పరిమాణాల్లో వినియోగదారులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని నిబంధనల ప్రకారం భద్రపరిచిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. NDPS చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయి సరఫరా చేసిన వ్యక్తులు, సరఫరా వ్యవస్థలో ఉన్న ఇతర వ్యక్తుల వివరాలను పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు.






