నమస్తే శేరిలింగంపల్లి: కడుపునొప్పి, శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఓ యువతి ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని మృతిచెందిన సంఘటన రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హర్యానా రాష్ట్రానికి చెందిన హరి ప్రీత్ కౌర్ మెహ్రా(21)రాయదుర్గంలో ఉంటూ హెచ్డిబి ఫైనాన్షియల్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. గత కొద్ది నెలలుగా యువతి కడుపునొప్పి, శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో వైద్య చికిత్స చేయించుకోలేక పోయింది. తన తండ్రి బల్విందర్ సింగ్ ఫోన్ చేసినప్పుడు తన అనారోగ్య సమస్యను తెలిపి బాధపడేది. ఈ క్రమంలో జనవరి 30న యువతి తండ్రి ఫోన్ చేయగా ఎలాంటి సమాధానం లేకపోవడంతో తన సోదరుడు కల్విందర్ సింగ్కు సమాచారం ఇచ్చాడు. జనవరి 31న కల్విందర్ సింగ్ హరిప్రీత్ కౌర్ మెహ్రా నివాసానికి వెళ్లాడు. తలుపు బద్దలు కొట్టి చూడగా యువతి ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని మృతిచెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బల్విందర్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రాయదుర్గం పోలీసులు వెల్లడించారు.
