గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలిలో చిరుత సంచరిస్తుందన్న వార్త కలకలం సృష్టిస్తుంది. గతంలో ఆరాంఘర్ చౌరస్థాలో నడిరోడ్డుపై చిరుత సంచరించి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసిన విషయం విధితమే. ఐతే తాజాగా గచ్చిబౌలిలోని రోడామిస్త్రీ కళాశాలలో చిరుత సంచరించినట్టు పలువురు గుర్తించినట్టు తెలుస్తుంది. ఒక కుక్కను నోట కరుచుకుని కళాశాల సమీపంలోని పొదళ్లోకి వెళ్లినట్టు సిబ్బంది గుర్తించినట్టు సమాచారం. అదేవిధంగా కళాశాల భవనానికి సైతం కొన్ని రక్తపు మరకలు ఉన్నట్టు వినికిడి. ఈ నేపథ్యంలో కళాశాల యాజమాన్యం ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా చిరుత సంచారంపై స్పష్టత కోసం వారు ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఐతే నిజంగా చిరుత ఉందో లేదో తెలియాల్సి ఉండగా, స్థానికులు మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.





