శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధిలోని శంకర్ నగర్, న్యూ శంకర్ నగర్ కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సందర్శించారు. మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని గాంధీ పేర్కొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూనే ప్రకృతిని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన విగ్రహాల వల్ల చెరువులు కలుషితమయ్యే అవకాశం ఉందని, జలవనరులను పరిరక్షించుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. వినాయక చవితి సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు గాంధీ తెలిపారు. పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు వినాయక మండపాల వద్ద ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండపాల నిర్వాహకులు కూడా భద్రతా చర్యలను పాటిస్తూ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.





