శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి వేగంగా పరిష్కారాలు చూపే లక్ష్యంతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) చేపట్టిన వన్ వార్డ్ ఎవరీ డే కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి జోన్, మియాపూర్ సర్కిల్ పరిధిలోని మక్తా మహబూబ్పేట్ వార్డులో అధికారులు క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎంసీ కమిషనర్ సృజనతో పాటు శాసనసభ్యుడు ఆరెకపూడి గాంధీ, జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్, డిప్యూటీ కమిషనర్, సర్కిల్ అధికారులు, వివిధ విభాగాల అధికారులు, RWA ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ స్థానిక నివాసులు, RWA ప్రతినిధులతో నేరుగా మాట్లాడి వార్డులో నెలకొన్న సమస్యలు, ప్రజల స్థానిక అవసరాలను తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ, పార్కులు, వీధి దీపాలు, తాగునీరు, స్టార్మ్ వాటర్ నిర్వహణ, పారిశుద్ధ్యం, ఆక్రమణలు, రహదారి భద్రత తదితర అంశాలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు వెల్లడించిన సమస్యలను విభాగాల వారీగా సమీక్షించిన కమిషనర్.. ప్రాధాన్యతా క్రమంలో అవసరమైన పనులను చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలపై సకాలంలో తదుపరి చర్యలు చేపట్టి, వివిధ విభాగాల మధ్య సమన్వయంతో పరిష్కారాలు అందించాలని సూచించారు. వన్ వార్డ్ ఎవరీ డే కార్యక్రమం ద్వారా ప్రజలతో నేరుగా మమేకమై, వార్డు స్థాయిలో పౌర సమస్యలను గుర్తించి పరిష్కరించడంతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు, పౌర సేవలు అందించేందుకు సీఎంసీ చర్యలు కొనసాగిస్తోంది.





