శేరిలింగంపల్లి, ఆగస్టు 27 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలో అనధికార నిర్మాణాలపై ఎన్ఫోర్స్మెంట్ చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం మూడు జోన్ల పరిధిలో అధికారులు క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో మొత్తం 54 అనధికార నిర్మాణాలను గుర్తించారు. వీటిలో 21 నిర్మాణాలను కూల్చివేయగా, 14 నిర్మాణాలకు నోటీసులు జారీ చేశారు. మరో నిర్మాణాన్ని సీజ్ చేశారు. మిగిలిన 33 కేసులపై తదుపరి కూల్చివేతలు, ఇతర ఎన్ఫోర్స్మెంట్ చర్యలు చేపట్టేందుకు నిర్దేశిత విధానం, వర్తించే నిబంధనల ప్రకారం ప్రక్రియ కొనసాగుతోంది.

జోన్ల వారీగా కూల్చివేతల వివరాలు ఇలా ఉన్నాయి. శేరిలింగంపల్లి జోన్లో 9 నిర్మాణాలను కూల్చివేయగా, కూకట్పల్లిలో 6, కుత్బుల్లాపూర్లో 6 నిర్మాణాలను కూల్చివేశారు. అనధికార నిర్మాణాలపై ప్రతిరోజూ క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహిస్తూ కఠిన పర్యవేక్షణ కొనసాగించాలని సంబంధిత టౌన్ ప్లానింగ్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలను సీఎంసీ కమిషనర్ సృజన ఆదేశించారు. భవన నిర్మాణ నిబంధనల అమలును నిర్ధారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ చర్యలు నిరంతరం కొనసాగుతాయని సీఎంసీ అధికారులు తెలిపారు. గుర్తించిన ప్రతి అనధికార నిర్మాణంపై నిబంధనలకు అనుగుణంగా అవసరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.






