శేరిలింగంపల్లి, ఆగస్టు 27 (నమస్తే శేరిలింగంపల్లి): ఉమ్మడి మాదాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ల రోడ్డు నుంచి పల్లవి ఎంక్లేవ్ మీదుగా జూబ్లీహిల్స్ వెళ్లే మార్గంలో రోడ్డు గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సిగ్నల్ సమీపంలో రోడ్డుపై గుంతలు ఏర్పడటంతో పాటు వర్షం పడిన సమయంలో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోంది.

ఈ సమస్యను గుర్తించిన ఉమ్మడి మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ వెంటనే స్పందించారు. సంఘటనా స్థలానికి వెళ్లి రోడ్డు పరిస్థితిని పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను వివరించారు. రోడ్డుపై ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చాలని, వర్షపు నీరు నిలిచిపోకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్కు అంతరాయం లేకుండా సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాహుల్, లక్ష్మణ్, అభి, నరేంద్ర రెడ్డి, నీలేష్, ఇమ్రాన్, సలీమ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.





