శేరిలింగంపల్లి, ఆగస్టు 8 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని స్ప్రింగ్ వ్యాలీ కాలనీలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించేందుకు పీఏసీ (PAC) చైర్మన్ ఆరెకపూడి గాంధీ కాలనీలో పర్యటించారు. కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు పర్యటించిన ఆయన స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ స్ప్రింగ్ వ్యాలీ అభివృద్ధికి ఆరెకపూడి గాంధీ నిరంతరం కృషి చేస్తున్నారని, కాలనీ అభివృద్ధి కోసం చేస్తున్న సేవలను మరువలేమని కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కాలనీలో అసంపూర్తిగా ఉన్న రోడ్లు, డ్రైనేజీ (UGD) పనులను పూర్తి చేయాలని, తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచాలని, అవసరమైన ప్రాంతాల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

దీనిపై స్పందించిన ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ కాలనీ వాసులు ప్రస్తావించిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అసంపూర్తిగా ఉన్న రోడ్లు, యూజీడీ పనులను దశల వారీగా పూర్తి చేస్తామని, తాగునీటి సరఫరాను మెరుగుపరచడంతోపాటు వీధి దీపాల ఏర్పాటు, పార్కుల అభివృద్ధి వంటి మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు ఆయన చెప్పారు. శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, స్ప్రింగ్ వ్యాలీ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.





