శేరిలింగంపల్లి, ఆగస్టు 2 (నమస్తే శేరిలింగంపల్లి): భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను శేరిలింగంపల్లి ఉద్యమ నాయకుడు చిర్రా రవీందర్ యాదవ్ నందినగర్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఒడిశాలోని పూరీ సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన సైకత శిల్పానికి సంబంధించిన ఫోటో ఫ్రేమ్ను ఆయనకు అందజేశారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా పూరీ బీచ్లో ప్రత్యేక సైకత శిల్పాన్ని రూపొందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన విషయాన్ని చిర్రా రవీందర్ యాదవ్ కేటీఆర్కు వివరించారు. సైకత శిల్పం చిత్రపటాన్ని పరిశీలించిన కేటీఆర్, రవీందర్ యాదవ్ను అభినందిస్తూ ప్రశంసించారు.

సమావేశంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ జరిగినట్లు రవీందర్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో భారాసను మరింత బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎంత మంది నేతలు పార్టీలు మారినా భారాసకు ప్రజల్లో ఆదరణ తగ్గదని, యువ నాయకత్వంతో పార్టీ మరింత బలపడుతోందని పేర్కొన్నారు. కేటీఆర్ మార్గదర్శకంలో ప్రతి ఎన్నికలో గులాబీ జెండా ఎగరేస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.





