శేరిలింగంపల్లి, జూలై 17 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రతి అర్హుడికి ఓటు హక్కు – ప్రతి ఓటరుకి సరైన నమోదు అనే లక్ష్యంతో అందరూ కలిసి పనిచేయాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ, రాజీవ్ గృహకల్ప ప్రాంతాల్లో నిర్వహిస్తున్న Special Intensive Revision (SIR) కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు జాబితా అత్యంత కీలకమైన పునాది అని అన్నారు. ఓటరు జాబితా కచ్చితత్వం, పారదర్శకత, సమగ్రతను మరింత బలోపేతం చేయడంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే అధికారులు మాత్రమే కాకుండా ప్రతి అర్హత కలిగిన పౌరుడు భాగస్వామి కావాలని ఆయన కోరారు. ప్రతి కుటుంబం తమ ఓటరు వివరాలను పరిశీలించి, అవసరమైన సవరణలు, కొత్త నమోదు లేదా మార్పులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని సూచించారు. సరైన ఓటరు జాబితా రూపొందడం అంటే ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమేనని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా భావించి తమ వంతు సహకారం అందించాలని జగదీశ్వర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు, పొరుగువారు, పరిసరాల్లోని అర్హులైన ప్రతి ఒక్కరికీ SIR కార్యక్రమంపై అవగాహన కల్పించి, వారిని కూడా ఇందులో భాగస్వాములు చేసేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ బీఎల్ఏలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు జహంగీర్, నాయకులు వెంకట్ రెడ్డి, కట్ల శేఖర్ రెడ్డి, కార్తీక్ గౌడ్, రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి శ్రీహరి గౌడ్, జావేద్, అలీ, రాజు, కుమార్, నర్సింగ్ రావు, చంద్రమౌళి, మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జయతోపాటు స్వాతి, సుధా, వెంకటమ్మ, శ్రీకళ, సౌజన్య, కళ్యాణి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.





