శేరిలింగంపల్లి, జూన్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి పరిధిలోని దీప్తిశ్రీనగర్ కాలనీ పార్కు కబ్జా వ్యవహారంపై జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగం రాజశేఖర్ జోనల్ కమిషనర్ (శేరిలింగంపల్లి), డిప్యూటీ కమిషనర్ (మియాపూర్)లకు ఫిర్యాదు చేశారు. సెల్ఫ్ డిక్లేర్ కాలనీ అధ్యక్షుడు అసోసియేషన్ పేరుతో పార్కు స్థలాలను ఆక్రమించడం, అక్రమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం జరుగుతోందని వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కాలనీలో, పార్కు పరిసరాల్లో చిరు వ్యాపారులను అనుమతించడం, పార్కు చుట్టూ బోర్డులు ఏర్పాటు చేసి అసోసియేషన్ పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై కూడా దర్యాప్తు జరిపించాలని జనం కోసం సంస్థ డిమాండ్ చేసింది. ప్రజా స్థలాల పరిరక్షణతోపాటు అక్రమ వసూళ్లు, ఆక్రమణలపై చట్టప్రకారం చర్యలు తీసుకుని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సంస్థ ప్రతినిధులు అధికారులను కోరారు.






