శేరిలింగంపల్లి, జూన్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆదిలక్ష్మి ఫుడ్ కోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్, మియాపూర్ డివిజన్ జనరల్ సెక్రటరీ యలమంచి ఉదయ్ కిరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతోపాటు మియాపూర్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తాండ్ర రాంచందర్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ఆదిలక్ష్మి ఫుడ్ కోర్ట్ యాజమాన్యం ఆహ్వానం మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నూతన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న యాజమాన్యానికి యలమంచి ఉదయ్ కిరణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యాపార రంగంలో విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ, వారి కృషి, పట్టుదలను అభినందించి శాలువాతో సత్కరించి గౌరవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ పారిశ్రామికవేత్తలు ఉపాధి అవకాశాలను సృష్టిస్తూ సమాజాభివృద్ధికి తోడ్పడటం అభినందనీయమన్నారు. వ్యాపార రంగంలో నాణ్యత, వినియోగదారుల విశ్వాసం, సేవాభావం విజయానికి మూల సూత్రాలని పేర్కొన్నారు.

కార్యక్రమంలో మియాపూర్ ప్రాంతానికి చెందిన పెద్దలు, ప్రముఖులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, చంద్రమౌళి, వెంకటేష్, రత్నాచారి తదితరులు పాల్గొని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన ఆహార సేవలను అందిస్తూ ఆదిలక్ష్మి ఫుడ్ కోర్ట్ మరింత అభివృద్ధి చెంది విజయవంతంగా ముందుకు సాగాలని యలమంచి ఉదయ్ కిరణ్ ఆకాంక్షించారు.





