శేరిలింగంపల్లి, జూన్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్నగర్ డివిజన్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సమతా నగర్లోని కార్పొరేటర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి హైదర్నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నో త్యాగాలు, దశాబ్దాల పోరాటాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. హైదర్నగర్ డివిజన్ సమగ్ర అభివృద్ధికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేస్తామని నార్నే శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.






