శేరిలింగంపల్లి, జూన్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణను స్వార్థపరుల బారినుంచి కాపాడుతూ స్వయంసమృద్ధి లక్ష్యంగా మలిదశ పోరాటం చేపట్టాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఉద్యమకారుడు, జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి పేర్కొన్నారు. దీప్తిశ్రీనగర్ సర్కిల్లో స్థానిక తెలంగాణవాదులు నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో స్థానికులకు నీళ్లు, నిధులు, ఉద్యోగాలు దక్కడం ప్రథమ ప్రాధాన్యత కావాలని అన్నారు. ఈ లక్ష్యాల సాధన కోసం యువత, విద్యార్థులు, సబ్బండ వర్గాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వనరులు స్థానికులకే చెందేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో జైలుశిక్ష అనుభవించిన తెలంగాణవాది హన్మంత్రావు మాట్లాడుతూ పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో వనరులు పరుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకోవాలని సూచించారు.

మాజీ సైనికుడు, తెలంగాణవాది నాగం రాజశేఖర్ మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా స్థానికేతరులు చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి ఆక్రమణలను అరికట్టేందుకు ప్రజలు చైతన్యవంతంగా వ్యవహరించాలని కోరారు. అశోక్ వర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కర్లపూడి రాఘవేందర్రావు, శివకుమార్ వర్మ, బాలు, సురేష్, నాగరాజు, దీప్తిశ్రీనగర్ కాలనీవాసులు పాల్గొన్నారు.





