శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) విజయదశమి ఉత్సవాన్ని శేరిలింగంపల్లిలోని గుల్మొహర్ బస్తీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో Dr.KSN నిఖిలేశ్ ముఖ్య అతిథిగా, H. మోహన్ కుమార్ ముఖ్య వక్తగా పాల్గొన్నారు. అనేక మంది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయం సేవకులు పూర్ణ గణవేష్ (full uniform) ధరించి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శక్తిని ఆరాధిస్తూ ఆయుధ పూజ చేశారు.

భరతమాతను ఆరాధిస్తూ ఏకాత్మతా స్తోత్రం అందరూ కలిసి పఠించారు. ప్రేరణాదాయకమైన అమృతవచనం, శత వసంతాలు జరుపుకున్న సంఘ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ అధర్మంపై ధర్మం విజయం విజయదశమి అని, 1925 వ సంవత్సరం విజయదశమి రోజు ప్రారంభించబడ్డ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనేక అవరోధాలను అధిగమించి, ఎన్నో విజయాలను సాధించి ఈ 2025 వ సంవత్సరం విజయదశమికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు.

దేశ విభజన సమయంలో పాకిస్తాన్ లోని హిందువులు భారతదేశానికి చేరుకోవటంలో సహాయం చేయడం, దేశ సంస్కృతికి చిహ్నమైన రామజన్మభూమి ఆలయ నిర్మాణం, కన్యాకుమారిలో వివేకానంద స్మారక నిర్మాణం, ప్రకృతి విపత్తులైన దివిసీమ ఉప్పెన, కరోనా సమయాలలో ప్రజలకు అండగా ఉండటం, వ్యక్తి నిర్మాణం ద్వారా ప్రజలలో దేశభక్తిని పెంచటం వంటివి RSS విజయాలలో కొన్ని అని అన్నారు. ప్రజలు విలువలతో కూడిన జీవనాన్ని సాగించాలని, పంచపరివర్తన్ పేరుతో పౌర విధులు, కుటుంబ ప్రబోధన, సామాజిక సమరసత, స్వదేశీ, పర్యావరణ పరిరక్షణ అనే అంశాలను పాటించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్దేశించిందన్నారు.





