కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కార్పొరేటర్ హమీద్ పటేల్ బుధవారం రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను కోరారు. ఈ మేరకు హమీద్ పటేల్ ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ను కలిసి కొండాపూర్ డివిజన్ పరిధిలో ఉన్న పలు సమస్యలు, నిధులు మంజూరు, డివిజన్ సమగ్ర అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనల వినతిపత్రాన్ని అందజేశారు.
మంత్రి కె. తారకరామారావు సానుకూలంగా స్పందించి వెంటనే త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ తెలిపారు. వినతిపత్రంలో ముఖ్యంగా డివిజన్ పరిధిలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాల సమస్యలు, రోడ్ల సమస్యలు, మంచి నీటి సమస్యల గురించి సవివరంగా తెలియపర్చినట్టు తెలిపారు. డివిజన్ పరిధిలోని శ్మశాన వాటికలు, పార్కులు అభివృద్ధి గురించి ప్రధానంగా కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లమన్నారు. సర్వే నెంబర్ 80 లోని ఇళ్ల స్థలాలను రెగ్యులరైజషన్ చెయ్యాలని, ఆ సర్వే నంబర్ లోని ప్రజలు మొత్తం దిగువ తరగతి వారే ఉన్నారని, కాబట్టి రెగ్యులరైజషన్ చేస్తే వారందరికీ ఎంతో మేలు జరుగుతుందని కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరటం జరిగిందన్నారు. డివిజన్ పరిధిలోని దృష్టికి వచ్చిన రెవిన్యూ సమస్యలను వివరంగా వినతిపత్రంలో పొందుపరచటం జరిగిందన్నారు. తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్తున్నామని, ప్రజలు కూడా ప్రభుత్వ పని తీరుకు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కేటీఆర్ కి తెలియపర్చటం జరిగిందన్నారు. ప్రధానంగా కొండాపూర్ డివిజన్ లో అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులను కేటాయించినందుకు కేటీఆర్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశామన్నారు.