- 2015 ఎమ్మెల్సీ, ఇటీవలి శాసనసభ ఎన్నికలతో పోలిస్తే పెరిగిన ఓటింగ్ పర్సంటేజి
- పెరిగిన శాతం తమకంటే తమకు లాభిస్తుందంటు ప్రధాన పార్టీల సంబురాలు
నమస్తే శేరిలింగంపల్లి: రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు శేరిలింగంపల్లిలో ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. 2015 ఎమ్మెల్సీ, ఇటీవలి శాసనసభ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగడం విశేషం. శేరిలింగంపల్లి సర్కిల్ 20లో 12 పోలీంగ్ స్టేషన్ల పరిధిలో మొత్తం 8713 మంది పట్టభద్రులు ఉండగా 4818 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ లెక్కన మొత్తం 55.30 శాతం పోలింగ్ నమోదైంది. అదేవిధంగా చందానగర్ సర్కిల్ 21లోని 21 పోలింగ్ స్టేషన్ల పరిధిలో మొత్తం 15798 మంది పట్టభద్రులు ఉండగా 8740 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ లెక్కన మొత్తం 55.32 శాతం పోలింగ్ నమోదైంది. 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో 30 శాతంకు మించి పోలింగ్ కాకపోగా ప్రస్థుతం ఆ శాతం 55 దాటడం విశేషం. ఐతే పెరిగిన పోలింగ్ శాతం అభ్యర్థికి అనుకూలం, అభ్యర్థికి ప్రతికూలం అని అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. కాగా ప్రధాన పార్టీల నేతలు మాత్రం పెరిగిన పోలింగ్ శాతం తమకు అంటే తమకు లాభం అంటూ.. భారీ మెజారిటీతో గెలుస్తున్నామంటూ సంకలు గుద్దుకుంటుంన్నారు. మరో మూడు రోజులు వేచి చూస్తే తప్ప అసలు విషయం బయటపడదు. కాగా సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి, సురవరం విజయలక్ష్మీలు గచ్చిబౌలి ప్రభుత్వ పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారి వెంట ఆ పార్టి రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు కన్యగారి నర్సింహారెడ్డి ఉన్నారు.




