శేరిలింగంపల్లి, ఆగస్టు 25 (నమస్తే శేరిలింగంపల్లి): వన్ వార్డ్ ఎవరీ డే కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ సృజన, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్, మియాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ తో పాటు వివిధ శాఖల అధికారులు మదీనాగూడ, హఫీజ్పేట్ వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా RWA ప్రతినిధులు, స్థానిక ప్రజలతో సమావేశమై వార్డుల్లో నెలకొన్న పౌర సమస్యలు, స్థానిక అవసరాలను సమీక్షించారు.

ప్రజలు ప్రధానంగా సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం, రోడ్ల మరమ్మత్తులు, డ్రైనేజీ, UGD, స్టార్మ్ వాటర్ సమస్యల పరిష్కారం, నీటి నిల్వ సమస్యలు, వీధి దీపాలు, విద్యుత్ పనులు, పార్కుల అభివృద్ధి, ప్రజా సౌకర్యాల కల్పన వంటి అంశాలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు, పాదచారుల రాకపోకలకు ఇబ్బందులు, ఆక్రమణలు, బహిరంగంగా వ్యర్థాలను వేయడం, కమ్యూనిటీ హాల్, శ్మశాన వాటికకు సంబంధించిన అభివృద్ధి పనులను కూడా ప్రజలు ప్రస్తావించారు. ప్రజలు లేవనెత్తిన సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎంసీ కమిషనర్ ఆదేశించారు. గుర్తించిన సమస్యలకు ప్రాధాన్యత క్రమంలో పరిష్కారాలు చేపట్టి, సకాలంలో చర్యలు తీసుకోవడంతో పాటు తదుపరి చర్యలపై పర్యవేక్షణ ఉండేలా చూడాలని సూచించారు. వన్ వార్డ్ ఎవరీ డే కార్యక్రమం ద్వారా ప్రజలతో నేరుగా మమేకమై, వార్డు స్థాయిలో ఉన్న పౌర సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.





