శేరిలింగంపల్లి, ఏప్రిల్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని పురస్కరించుకొని చందానగర్ డెఫ్ అండ్ డంబ్ (చెవిటి మూగ) స్కూల్ లో మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, విద్యార్థినీ విద్యార్థులకు ఫ్రూట్స్, బిస్కెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ విచ్చేసి మాట్లాడుతూ భారత దేశ ఆధునిక యుగ వైతాళికుడు, ప్రధమ సామాజికవేత్త మహాత్మాఫూలే అని కొనియాడారు. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతోపాటు మహిళోద్ధరణకు కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా ఫూలే అని అన్నారు. ఫూలే దంపతులు మహిళా విద్యకు మార్గదర్శకులు. 1848 లో పూణేలో మొదటి బాలిక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
తరతరాలుగా అన్ని రకాలుగా అణచివేతకు వివక్షకు గురైన బడుగు బలహీన వర్గాలలో ఆత్మస్థైర్యము కలిగించి వారి హక్కులపై పోరాడి, సాధికారిత కోసం కృషిచేసిన మహోన్నతుడు ఫూలే అని అన్నారు. సాంఘిక సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆలోచించి, వారిలో చైతన్యం కలిగించారు. వితంతు వివాహాలను ప్రోత్సహించారు. అనేక అనాధ శరణాలయాలను ఏర్పాటు చేసి ఎందరికో ఆశ్రయం కలిగించారు. వితంతువులైన గర్భిణీ స్త్రీలకు పురుడుబోసి, వారి జీవితాలలో వెలుగులు నింపిన మహానీయులు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ మెర్సీ, అధ్యాపకురాలు శోభా, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కౌండిన్యశ్రీ, నండూరి వెంకటేశ్వరరాజు, పాలం శ్రీను, బాలరాజు, జనార్ధన్, జిల్ మల్లేష్, సుబ్బయ్య, చంద్రశేఖర్, విజయానంద్ తదితరులు పాల్గొన్నారు.