నమస్తే శేరిలింగంపల్లి: పేద విద్యార్థులకు సందయ్య మెమోరియల్ ట్రస్ట్ అండగా నిలవడం అభినందనీయమని మాజీ ఎంపీ, బిజెపి రాష్ట్ర నాయకులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. లింగంపల్లి ప్రభుత్వ పాఠశాలలో సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే ఎం.బిక్షపతి యాదవ్, బిజెపి నేత రవి కుమార్ యాదవ్ తో కలిసి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విద్యార్దులకు ఉచిత నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సమాజ సేవ చేయడానికి యువత రాజకీయాల్లోకి రావాలని సూచించారు. ఉచితంగా నోటు బుక్లు పంపిణీ చేస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కొరకు సహకరిస్తున్న రవికుమార్ యాదవ్నుఅభినందించారు. శేరిలింగంపల్లికి ఎం. బిక్షపతి యాదవ్ లాంటి రాజకీయ నాయకున్ని అందించిన ఘనత లింగంపల్లి పాఠశాలకు దక్కిందన్నారు. సందయ్య ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు ఉచిత విద్య, వైద్యానికి సాయం చేయడం సంతోషకరమని అన్నారు.

మాజీ ఎమ్మెల్యే ఎం. బిక్షపతి యాదవ్ మాట్లాడుతూ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తేనే విద్య సజావుగా సాగుతుందని అన్నారు. సమయానికి పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా కనీస వసతులు లేకుండా విద్యార్ధులు ఎలా చదువుతారని ప్రశ్నించారు. ఈ పాఠశాలలో చదువుకున్న తాను లింగంపల్లి పాఠశాల నుంచే నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. విద్యార్థులు కష్టపడి చదివితే రానున్న జీవితంలో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని తెలిపారు. సందయ్య మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి, బిజెపి నాయకులు రవి కుమార్ యాద్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి ఎం. సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా శేరిలింగంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. లింగంపల్లి పాఠశాలతో పాటు నియోజకవర్గంలోని 70 పాఠశాలల్లో ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు. 10వ తరగతి విద్యార్థులకు ఈ సారి కూడా ఉచితంగా స్టడీ మెటిరీయల్ అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థి దశ నుండే ప్రశ్నించే తత్త్వం అలవరచుకొని నాయకత్వ లక్షణాలను పెంచుకోవాలని సూచించారు. గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ కష్టపడి చదివితే రానున్న జీవితంలో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం లింగంపల్లి పాఠశాలలో 10 వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా విద్యార్ధులతో కలిసి పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి పటేల్, సోమదాస్, నవతా రెడ్డి, కంచర్ల ఎల్లేష్, సింధు రెడ్డి, రాధాకృష్ణ యాదవ్, రఘునాథ్ యాదవ్, నాగుల్ గౌడ్, వసంత్ కుమార్, తిరుపతి, విష్ణువర్ధన్ రెడ్డి, ఆంజనేయులు సాగర్, పద్మ, రేణుక, ఆకుల లక్ష్మణ్, రమేష్, పృథ్వి, సీతారామరాజు, గణేష్, వినోద్, శ్రీనివాస్, జే. శ్రీను, అర్జున్, విజయ్, కృష్ణ, రామకృష్ణ, నర్సింగ్ నాయక్, రాయుడు, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
