శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలు, అపార్ట్మెంట్లలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్తో కలిసి మియాపూర్ విలేజ్, నడిగడ్డ తండా, మయూరి నగర్ కాలనీతో పాటు దివ్య శ్రీ శక్తి అపార్ట్మెంట్స్, ఏఆర్కే టవర్స్, లక్ష్మీస్ ఇంపీరియా, శ్రీలా గార్డెన్, యూనిటీ ఎనక్లేవ్, ఎస్ఎంఆర్ వినయ్ సిటీ, శ్రీ లక్ష్మీనగర్ కాలనీ, నైల అపార్ట్మెంట్స్, నాగార్జున ఎనక్లేవ్, అల్లూరి సీతారామరాజు నగర్, మిర్ర పాంచజన్య, కృషి నగర్ కాలనీల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూనే పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు. పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని, భక్తితోపాటు ప్రకృతి పట్ల బాధ్యత కలిగి ఉండటం ప్రతి ఒక్కరి ధర్మమని అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన విగ్రహాల నిమజ్జనం కారణంగా చెరువులు కలుషితమయ్యే అవకాశం ఉందని గాంధీ పేర్కొన్నారు. చెరువులను కాలుష్యం నుంచి కాపాడుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, అందరూ మట్టి విగ్రహాలను వినియోగించి పర్యావరణహితంగా వినాయక చవితి జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

వినాయక పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పండుగ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు వినాయక మండపాల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మండపాల నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.





