శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్ (FPA) ఇండియా హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో జిన్నారం మండలం వావిలాలలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బాలికలకు హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకాల కార్యక్రమం నిర్వహించారు. 9 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల బాలికలకు రెండో డోస్లో భాగంగా 8 మంది బాలికలకు హెచ్పీవీ టీకా వేశారు.

ఈ సందర్భంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న బాలబాలికలకు ఆరోగ్యం, పౌష్టికాహారం, వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు చేపట్టారు. వైద్యురాలు డాక్టర్ నళిని సుమారు 120 మంది విద్యార్థులను పరీక్షించి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అవసరమైన ఆరోగ్య సూచనలు అందించారు. కార్యక్రమంలో FPA ప్రోగ్రామ్ ఆఫీసర్ ప్రశాంత్, యువ వాలంటీర్ సార్ధిక్, ANMలు కుమారి, కవిత, కోఆర్డినేటర్ సురేష్ పాల్గొన్నారు. పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం రాజారావుతో పాటు వైవీ శర్మ, ఋషి, రాజిరెడ్డి, జె. లత, పవన్రాజు, మాధవి తదితరులు కార్యక్రమంలో పాల్గొని నిర్వాహకులను అభినందించారు.





