వివేకానందనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని వివేకానందనగర్ కాలనీకి చెందిన పారిశ్రామికవేత్త జువ్వా భాస్కర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. తెలుగు దేశం పార్టీకి చెందిన భాస్కర్ రావు తన అనుచర గణంతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యల సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ అనేక సంక్షేమ కార్యక్రమాలతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ప్రగతి ప్రథాన పయనిస్తోందని అన్నారు. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని కొనియాడారు.

ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ.. ఐటీ రంగంలో హైదరాబాద్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందంటే అందుకు కారణం కేటీఆర్ అని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించాలన్నారు. అనంతరం పారిశ్రామికవేత్త భాస్కరరావు మాట్లాడుతూ ఆరెకపూడి గాంధీ నిత్యం అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. తెరాస ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు, గాంధీ అంకిత భావమే తనను పార్టీలో చేరే విధంగా చేశాయని పేర్కొన్నారు. తనతోపాటు తన అనుచర గణం మొత్తం తెరాస పార్టీకి, గాంధీకి తోడుగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కుమారుడు పృథ్వీ గాంధీ పాల్గొని పారిశ్రామికవేత్త జువ్వా భాస్కర్ రావును అభినందించారు.
