శేరిలింగంపల్లి, ఏప్రిల్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ ప్రశాంత్ నగర్ ప్రాంతానికి చెందిన వివిధ పార్టీల ముఖ్య నాయకులు, మహిళా నేతలు ఆదివారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్, రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బందారపు నర్సయ్య గౌడ్, జిల్లా అధ్యక్షుడు బండారి రమేష్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మల్లన్న వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవ పోరాటమే టీఆర్పీ సిద్ధాంతమని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల హక్కుల కోసం తాము చేస్తున్న పోరాటం ప్రజల్లోకి బలంగా వెళ్తోందని, అందుకే ప్రజలు స్వచ్ఛందంగా ఇతర పార్టీలను వీడి తమ వెంటే నడుస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రవాహం మరింత ఉధృతమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బస్తీ అధ్యక్షుడు యాది, ఉపాధ్యక్షురాలు రాములమ్మ, లచ్చప్ప, తిమ్మయ్య, స్వామి, చిన్న తెల్లప్ప, చంద్రకాంత్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






