శేరిలింగంపల్లి, మే 27 (నమస్తే శేరిలింగంపల్లి): ఆంధ్ర అసోసియేషన్ ఢిల్లీ (రిజిస్టర్డ్) కేంద్ర అధ్యక్ష పదవికి తారజు ప్యానల్ (AAD) తరఫున నెల్లి గురుదేవ్జీ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. జూన్ 28న జరిగే ఎన్నికల్లో తమ ప్యానల్కు మద్దతు ఇవ్వాలని ఆయన సభ్యులను కోరారు. ఈ సందర్భంగా తారజు ప్యానల్ తమ విజన్ను వెల్లడించింది. మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని పేర్కొన్నారు. ఢిల్లీ NCR ప్రాంతంలోని తెలుగు ప్రజలకు 24 గంటల ఉచిత వైద్య సేవలు అందించడంతోపాటు, MCI , ఢిల్లీ ప్రభుత్వ సహకారంతో 100 బెడ్ల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే IAS, IPS, IRS తదితర పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్, హాస్టల్, భోజన సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు. తెలుగు ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం ఆంధ్ర-తెలంగాణ కో-ఆపరేటివ్ బ్యాంక్ స్థాపనకు కృషి చేస్తామని చెప్పారు.

హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఉమ్మడి సంబరాల ద్వారా జాతీయ సమగ్రతను బలోపేతం చేస్తామని, పేద తెలుగు కుటుంబాలకు దుస్తులు, కూరగాయలు, అన్నం పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి త్రైమాసికం ఓటర్ ID, అసోసియేషన్ సభ్యత్వ నమోదు డ్రైవ్ చేపడతామని వెల్లడించారు. యువతకు క్రీడలు, శారీరక విద్యా కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు, 24×7 తెలుగు కస్టమర్ కేర్, సెక్యూరిటీ సపోర్ట్ అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అవినీతి, నిధుల దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మొత్తం 96 పదవులకు ఆసక్తి గల 18 నుంచి 55 సంవత్సరాల వయస్సు కలిగిన వారు తమ బయోడేటా, సంప్రదింపు వివరాలు పంపవచ్చని తెలిపారు. WhatsApp నంబర్ 95824 35311 ద్వారా సంప్రదించాలని సూచించారు.





