శేరిలింగంపల్లి, మార్చి 29 (నమస్తే శేరిలింగంపల్లి): రంజాన్ పండుగను పురస్కరించుకొని మసీదు వద్ద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు వసతులను కల్పిస్తామని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు , వేడుకల నిర్వహణకు ఎటువంటి సమస్యలు లేకుండా అన్ని సౌకర్యాలను జిహెచ్ఎంసి పరంగా కల్పిస్తామన్నారు. జోన్ పరిధిలోని మాదాపూర్ డివిజన్ కాకతీయ హిల్స్ అలంగీర్ మసీదును అధికారుల బృందం, మసీద్ ట్రస్ట్ సభ్యులతో కలిసి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మసీదు వద్ద ప్రత్యేక పారిశుధ్య చర్యలను చేపట్టాలని , పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు . వీధి దీపాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని , గుంతలు పడ్డ రహదారులకు తక్షణ మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు.
రంజాన్ పండుగను పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో మసీదుకు ప్రార్థనలు చేసేందుకు ముస్లింలు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి ఆదేశించారు. కాకతీయ హిల్స్ రోడ్ నెంబర్ 11 నుంచి శ్రావణి హాస్పిటల్ గుట్టల బేగంపేట్ వరకు అనుసంధాన రహదారి నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని , నాణ్యతతో సకాలంలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన స్పష్టం చేశారు. పనులపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలని పేర్కొన్నారు . అలాగే మియాపూర్ లో ఉన్న పెదకుడి చెరువు, పటేల్ చెరువు, కుడికుంట చెరువులను పరిశీలించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్ మోహన్ రెడ్డి ,ఏసిపి నాగిరెడ్డి ,డి ఈ శ్రీదేవి ,వైద్యాధికారి డాక్టర్ రవి ,ఏఈ ప్రశాంత్ ,ఈద్గా కమిటీ ప్రతినిధులు రియాజ్ తదితరులు పాల్గొన్నారు.