కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పునరుద్ధరించాల‌ని బీఆర్ఎస్ నిరసన

శేరిలింగంపల్లి, ఆగస్టు 17 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పాపిరెడ్డి కాలనీలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం భారీ నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ ఇన్‌ఛార్జ్ మాధవరం కృష్ణారావు ఆదేశాల మేరకు స్థానిక నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. కాలనీ వీధుల్లో నినాదాలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నిరసన తెలిపారు. పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థికంగా అండగా నిలిచే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.

ఈ సందర్భంగా పొట్ట నరేందర్ యాదవ్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాల కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేసిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాలపై నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. పేద కుటుంబాల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి మాట్లాడుతూ మహిళలు, పేద కుటుంబాలు ప్రభుత్వ స‌హాయం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. పేదల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునఃప్రారంభించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. ఈ నిరసనతో శేరిలింగంపల్లి ప్రాంతంలో పేదల సంక్షేమ పథకాలపై రాజకీయ వేడి నెలకొంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here