శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి తండాలో తుల్జా భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి నిమజ్జన శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్, గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గణపతి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ నగరంలో యువత ఐక్యంగా నిర్వహించే వినాయక నవరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయని తెలిపారు. గణపతి నిమజ్జనం వేడుకలకు ముగింపు కాదని, కొత్త ఆరంభానికి సంకేతమని పేర్కొన్నారు.

నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా చెరువుల వద్ద పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు. భక్తులు, ప్రజలు శాంతియుత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలను నిర్వహించుకోవాలని కోరారు. అనంతరం నిర్వహించిన గణేష్ లడ్డూ వేలం పాటలో గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు. వేలంలో మొదటి లడ్డూను రూ.2.05 లక్షలకు గోపనపల్లి తండాకు చెందిన ప్రకాష్ నాయక్, రెండవ లడ్డూను రూ.1.10 లక్షలకు కృష్ణ నాయక్ దక్కించుకున్నారు. లడ్డూ వేలంలో విజేతలుగా నిలిచిన ప్రకాష్ నాయక్, కృష్ణ నాయక్లకు గంగాధర్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు, స్థానిక నేతలు, భక్తులు, మహిళలు, కాలనీ వాసులు, కార్యకర్తలు, గణేష్ మండపాల నిర్వాహకులు, గణేశ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






