శేరిలింగంపల్లి, సెస్టెంబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR)-2026 ప్రక్రియలో భాగంగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సి. సుదర్శన్ రెడ్డి శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాన్ని సందర్శించారు. నియోజకవర్గంలో కొనసాగుతున్న SIR-2026 ప్రక్రియ పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ERO, జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ సీఈఓ వెంట ఉండి SIR ప్రక్రియకు సంబంధించిన వివరాలను ఆయనకు వివరించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ పనులు, ప్రక్రియ పురోగతిని సీఈఓ స్వయంగా పరిశీలించారు. ఓటర్ల జాబితా సవరణ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. అదే సమయంలో ప్రక్రియలో పూర్తి పారదర్శకత, కచ్చితత్వం పాటించాలని, ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి దశను నిర్వహించాలని స్పష్టం చేశారు. SIR-2026 ప్రక్రియను ఎలాంటి తప్పులకు తావులేకుండా, క్రమబద్ధమైన పద్ధతిలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నిరంతర పర్యవేక్షణతో పనులను ముందుకు తీసుకెళ్లడం ద్వారా నమ్మకమైన, కచ్చితమైన, తాజా ఓటర్ల జాబితాను సిద్ధం చేయవచ్చని సీఈఓ పేర్కొన్నారు.





