శేరిలింగంపల్లి, ఆగస్టు 26 (నమస్తే శేరిలింగంపల్లి): గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు తీజ్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. మైసిగండిలో గిరిజనులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తీజ్ పండుగ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై గిరిజనులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ.. తీజ్ పండుగ సందర్భంగా పెళ్లికాని గిరిజన యువతులు భక్తిశ్రద్ధలతో తమ ఆరాధ్య దైవాలను పూజించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. మంచి వరుడు లభించి, త్వరగా వివాహం జరగాలని కోరుకుంటూ యువతులు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఈ పండుగలోని విశిష్ట సంప్రదాయమని తెలిపారు.

తీజ్ పండుగ కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, గిరిజనుల జీవన విధానం, విశ్వాసాలు, ఆచార సంప్రదాయాలు, సామాజిక ఐక్యతకు ప్రతిబింబమని గంగాధర్ రెడ్డి పేర్కొన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న గిరిజనుల సంప్రదాయాలను పరిరక్షించి, వాటి గొప్పతనాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గిరిజనుల సంక్షేమం, హక్కులు, అభివృద్ధితో పాటు వారి సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. గిరిజన సమాజ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల ప్రతినిధులు, సీనియర్ నాయకులు శ్రీరాములు, తులసి రామ్, అర్జున్, ప్రకాష్, రంగస్వామి, గోవర్ధన్, రవీంద్ర, రాజు, గోపాల్, పరమేశ్, టీకి లాల్, శారద, నందిని, ఇందు తదితరులతో పాటు స్థానిక నేతలు, ప్రజలు, మహిళలు, యువత పాల్గొన్నారు.





