శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): అంజయ్య నగర్లో నిర్మాణంలో ఉన్న భవనం కూలి అమాయకుల ప్రాణాలు కోల్పోయిన ఘటనకు బాధ్యులైన అధికారులపై ప్రభుత్వం వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాలపై గతంలో పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. సిఎంసి కమిషనర్ సృజన, డిప్యూటీ కమిషనర్ బాలకృష్ణ, టౌన్ ప్లానింగ్ ఏసీపీ, టీపీఎస్ సంతోష్తో పాటు బాధ్యులైన ఇతర అధికారులపై విచారణ జరిపి, కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

అక్రమ నిర్మాణాలపై సకాలంలో చర్యలు తీసుకుని ఉంటే ఈ తరహా ప్రమాదాలను నివారించే అవకాశం ఉండేదని మల్లారెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికైనా సిఎంసి అధికారులు మేల్కొని అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేసి, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవనం కూలిన ఘటనకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేసి సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన కోరారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలు నిరుపేదలైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, కుటుంబంలో ఉద్యోగానికి అర్హత ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాలని మిద్దెల మల్లారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.





