శేరిలింగంపల్లి, జూలై 31 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి పరిధిలోని వైశాలి నగర్ సమీపంలోని కాలువలో గల్లంతైన వ్యక్తి బాలయ్య మృతదేహం కోసం హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు ముమ్మర గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ నీటిలో ప్రత్యేక కెమెరాలను పంపించి ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గాలింపుకు ఆటంకంగా మారుతున్న చెత్తను ముందుగా తొలగించి, అనంతరం మరోసారి కెమెరాలతో నీటిలో జల్లెడ పడుతూ మృతదేహం ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

అదే సమయంలో పటాన్చెరు పరిధిలోని నక్కవాగు, భవానీపురంలోని చిన్నవాగు ప్రాంతాల్లో కూడా హైడ్రా, జీహెచ్ఎంసీ సంయుక్త బృందాలు విస్తృతంగా గాలింపు చేపట్టాయి. కాలువలు, వాగుల వెంట ప్రతి అనుమానాస్పద ప్రాంతాన్ని పరిశీలిస్తూ ఆచూకీ కోసం అన్వేషణ కొనసాగిస్తున్నాయి. ఈ గాలింపు చర్యలను శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ పర్యవేక్షిస్తూ అధికారులకు అవసరమైన సూచనలు అందిస్తున్నారు. అధికారులు అన్ని అవకాశాలను పరిశీలిస్తూ గాలింపును మరింత వేగవంతం చేశారు.





