శేరిలింగంపల్లి, జూలై 26 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు కళాభిమానులను అలరించాయి. ఈ సందర్భంగా లండన్ నుంచి వచ్చిన కూచిపూడి నాట్య కళాకారుడు వైష్ణవ దాచవరం తన అద్భుత నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. వైష్ణవ దాచవరం దేవ దేవం భజే, ఆడెనమ్మా హరుడు, ఆంజనేయ అనీలజ హనుమంత వంటి నృత్యాంశాలను ప్రదర్శించి విశేష ప్రశంసలు అందుకున్నాడు.

అనంతరం సత్యా నందిని, రమ్య సాహితి ఆధ్వర్యంలోని బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ బృందం గజవదాన బెదువే, వెడెలెరా వయ్యారాలు, కొలువై తివరంగశాయి, నారాయణీయం, క్షీరసాగర శాయన, మండూక శబ్దం, కేశవ నారాయణ, ముద్దుగారే యశోద వంటి నృత్యాంశాలను అద్భుతంగా ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందింది.
ఈ కార్యక్రమంలో సత్యా నందిని, రమ్య సాహితి, లావణ్య, కావ్య, అస్సికా, ఆరోహి, కృతిక తదితరులు పాల్గొని తమ నృత్య ప్రతిభను చాటారు. వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన ఈ కూచిపూడి ప్రదర్శనలు శిల్పారామానికి విచ్చేసిన సందర్శకులను విశేషంగా అలరించాయి.





