శేరిలింగంపల్లి, జూలై 13 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి-షాదీ ముబారక్ పథకం కింద మంజూరైన రూ.3,22,37,352 విలువైన చెక్కులను పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ 322 మంది లబ్ధిదారులకు అందజేశారు. మియాపూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యాదవ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు హమీద్ పటేల్, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ ఆర్థిక సహాయాన్ని శేరిలింగంపల్లి మండలంలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్పేట్, చందానగర్, భారతి నగర్ (పార్ట్) డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ఒకే రోజు 322 మంది లబ్ధిదారులకు రూ.3.22 కోట్లకుపైగా విలువైన కల్యాణలక్ష్మి-షాదీ ముబారక్ చెక్కులను అందజేయడం సంతోషకరమని అన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతిగా, పేదింటి ఆడబిడ్డలకు పెద్దన్నలా అండగా నిలుస్తున్నారని కొనియాడారు. దేశంలోనే ప్రత్యేకంగా నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో కల్యాణలక్ష్మి-షాదీ ముబారక్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని, పేదింటి ఆడపిల్లల వివాహాలు సంతోషంగా జరగడానికి ఈ పథకం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.





