శేరిలింగంపల్లి, జూలై 11 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నేతాజీ నగర్ కాలనీలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు శనివారం ఎమ్మార్వో మహిపాల్ రెడ్డి పర్యటించారు. కాలనీలో ఇంటింటికి వెళ్లి ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని బీఎల్ఏలు, బీఎల్వోలకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన ఓటరు నమోదు కార్యక్రమంలో బస్తీల్లో నివసించే నిరుపేదలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చదువు లేకపోవడంతో చాలా మంది దరఖాస్తు ఫారాలు నింపలేక ఇబ్బంది పడుతున్నారని, అధికారులు చొరవ తీసుకుని ఇంటింటికి వెళ్లి వారికి సహాయం చేయాలని కోరారు.

ప్రజల అభ్యర్థన మేరకు ఎమ్మార్వో మహిపాల్ రెడ్డి కాలనీలో పర్యటించి పరిస్థితిని పరిశీలించి, ప్రతి అర్హుడి ఓటు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా రామచందర్ యాదవ్ మాట్లాడుతూ, ప్రజల అనుమానాలను నివృత్తి చేస్తూ ఎవరి ఓటు గల్లంతు కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి దీపక్ కుమార్, బీఎల్వో పరమేష్, కాలనీ ఉపాధ్యక్షుడు రాయుడు, బుడగ జంగాల పంతం వెంకటేష్, పంతం శ్రీను, నాగపురి నగేష్ యాదవ్, ఎండి జాఫర్, శివ యాదవ్, నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.





