శేరిలింగంపల్లి, జూలై 5 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision–SIR) కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కట్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పలు కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు SIR ప్రక్రియపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా నాయకులు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరిస్తూ, SIR దరఖాస్తు ఫామ్లను పంపిణీ చేశారు. ఫారాలను ఎలా సక్రమంగా పూరించాలి, ఎక్కడ సమర్పించాలి వంటి అంశాలను ప్రజలకు వివరించి మార్గనిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కట్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రతి భారతీయ పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కు అని అన్నారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగస్వాములు కావాలని, తమ ఓటరు వివరాలను ఒకసారి పరిశీలించి అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ అవగాహన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.





