శేరిలింగంపల్లి, జూలై 5 (నమస్తే శేరిలింగంపల్లి): భారతదేశ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడం ప్రతి భారతీయుడి అదృష్టంగా భావించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు, గౌతమీనగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ముఖ్య సలహాదారు కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. వివేకానంద వర్ధంతి సందర్భంగా గౌతమీనగర్ కాలనీ మున్సిపల్ పార్కులోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వివేకానందుడు యువతకు చూపిన మార్గం నేటికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. దృఢమైన శారీరక, మానసిక బలంతో యువత ముందుకు సాగినప్పుడే దేశం మరింత బలపడుతుందని స్వామి వివేకానంద చెప్పిన సందేశాన్ని గుర్తు చేశారు. యువత ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టి దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా పాల్గొన్న వారు స్వామి వివేకానంద ఆశయాలను అనుసరిస్తామని నినాదాలు చేశారు. కార్యక్రమంలో కాలనీవాసులు అశోక్ కుమార్, మురళీధర్, దామోదర్ గౌడ్, నూకల లక్ష్మణ్, నర్సింహ, రామస్వామి, పాండురంగాచారి, రవీందర్ రెడ్డి, నాయర్, వినాయక్ రెడ్డి, తనవ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.





