శేరిలింగంపల్లి, నవంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ చైతన్య స్కూల్ నిజాంపేట్ రోడ్డు బ్రాంచ్ నిర్వహించిన ఫిట్ ఇండియా మూవ్ మెంట్ 2K రన్ కార్యక్రమంలో హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు ముఖ్య అతిథిగా పాల్గొని స్కూల్ ఆవరణలో జ్యోతి ప్రజ్వలన చేసి కిందికుంట పార్క్ వరకు జరిగిన 2K రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ స్కూల్ విద్యార్థుల కోసం నిర్వహించే 2K రన్ శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించే మంచి కార్యక్రమం అని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు వ్యాయామానికి అలవాటు పడతారని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడానికి ప్రేరణ పొందుతారని అన్నారు. క్రమశిక్షణ, జట్టుగా పనిచేయడం వంటి విలువలు నేర్చుకుంటారని, పాఠశాలలు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా పిల్లల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందించి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చైతన్య స్కూల్ AGM శివరామకృష్ణ, RI పద్మజా, RI శ్రీనివాస రెడ్డి, జోనల్ కోఆర్డినేటర్ మురళి కృష్ణ, ప్రిన్సిపల్ సిందూష, డీన్ సునీల్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.






